
మోన్శాంటో పై భారతీయ రైతులకి ఇది ఒక తీపి విజయమే!! వ్యవసాయాధారిత భారతదేశంలో వ్యవసాయంపై గుత్తాధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న మోన్శాంటోకి ఇది ఒక ఎదురు దెబ్బగా భావించవచ్చు, కాని BT వంగపై ఇంకా పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కనపెట్టింది. అంటే భవిష్యత్తులో ఈ ముప్పు ఏదో ఒక రోజు సంభవించే ప్రమాదం లేకపోలేదు.
ఇప్పటికే BT పత్తి తో మనదేశ మార్కెట్ ను కైవసం చేసుకున్న మోన్శాంటో, వంగతో మరోసారి రైతులని దోచుకోవాలని చూస్తోంది. ఈ BT కథాకమామిషు ఏంటో ఒకసారి చూద్దాం.
BT(Bacillus thuringiensis) అనేది ఒక జన్యువుని మరొక జీవంలో ప్రవేశ పెట్టే పద్దతి. దీనినే జన్యుమార్పిడి అని కూడా అంటారు. జన్యు మార్పిడి అంటే అది ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళడమే. ఈ విధానంలో విత్తనంలో ఒకరకమైన క్రిమిని ప్రవేశపెడతారు, ఈ క్రిమివలన ఆ విత్తనం నుండి వచ్చిన మొక్కకు తెగుళ్ళు సోకవు. కానీ ఇలా చేయడం వలన భూమిలో నత్రజనిని అభివృద్ది చేసే క్రిములు కూడా నశించి అసలుకే ఎసరు వస్తోంది, తొలి పంటకి గణనీయమైన దిగుబడి వచ్చినా మలి పంటలలో ఆ దిగుబడి 50% వారకూ తగ్గిపోయి రైతుకి తీరని వేదననే మిగిలిస్తున్నాయి. ఇదంతా ఒక పార్శ్వం అనుకుంటే, జన్యుమార్పిడి చేసిన పంటలు పండించే రైతులు చరంవ్యాదులకి గురవ్వడం, ఆ పంటలని తిన్న పశువులు మరణించడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. వీటిన పండించిన రైతులు అప్పులుపాలై, పంటను కోల్పోయినప్పుడు భీమా డబ్బు చెల్లించాల్సిన మోన్శాంటో ముఖం చాటేస్తుండటంతో చివరికి ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. ఈ మధ్యకాలంలో మనం విన్న ప్రత్తి రైతుల ఆత్మహత్యలకి ఏకైక పెద్ద కారణం మోన్శాంటో కంపెనీయే!!
వాణిజ్య పంటలు పండిస్తేనే రైతు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న BT విత్తనాలు, ఇక ఆహార పంటలలో ఎంత ప్రభావాన్ని చూపిస్తాయో చెప్పనవసరంలేదు. మానవులపై BT ఆహార ప్రభావాన్ని పరిశోధన చేయకుండానే, అమెరికా లాంటి అగ్ర దేశాలలో ఈ ఆహారాన్ని, పంటలని వినియోగించకుండానే ఇక్కడ ప్రవేశపెడుతున్నారంటే మన దేశాన్ని అగ్ర రాజ్యాలు ప్రయోగశాలగా ఉపయోగించుకుంటున్న విషయం మనకు తెలుస్తుంది. 2400 రకాల దేశీయ వంగను పండింఛే రైతులు BT విత్తనాలని అనుమతిస్తే మోన్శాంటో దగ్గర విత్తనాలని కొనుక్కొవల్సిన పరిస్థితి వస్తుంది. ఒకసారి ఈ పంటని ప్రవేశ పెడితే దానివలన మన దేశీయ పంటరకాలు అతి వేగంగా అంతరించిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతానికి మన రైతాంగం BT పై విజయం సాధించిందనే చెప్పుకోవాలి. ఈ విజయంలో ప్రజా, రైతు సంఘాలతో పాటు గ్రీన్ పీస్, బ్లూ క్రాస్ లాంటి సంస్థలకి కూడా వాటా ఉంది.
